" ఆశయాలు: 1.శాస్త్ర విజ్ఞానం ద్వారా మూఢ విశ్వాసాలను, ఛాందస భావాలను అరికట్టడం"

ఆశయాలు: 2. సామాన్య ప్రజల్లో శాస్త్ర విజ్ఞానం ప్రచారం చేయడం శాస్త్రీయ దృక్పధాన్ని పెంపోందించడం.

ఆశయాలు: 3. వివిధ రంగాలలో ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని శాస్త్రపరిశోధనల్ని ప్రోత్సహించడం.

ఆశయాలు: 4. ప్రజలు ఎదుర్కోంటున్న అనేక సమస్యల మౌలిక స్వరూప స్వభావాలను గురించి సమగ్రమైన శాస్త్రీయ అవగహనను పెంపొందించడం, పరిష్కరాలు అన్వేషించడం.

ఆశయాలు: 5. ఏ కొద్దిమందికో పరిమితమైన శాస్త్ర విజ్ఞానం సామాన్య ప్రజలకు సైతం అందేటట్లు ప్రయత్నించడం.

ఆశయాలు: 6. సత్యాన్వేషణకు, దేశస్వావలంబనకు, సమగ్రతకు, లౌకికతత్వానికి, ప్రపంచశాంతికి, సామాజికాభివృద్ధికి, సాంస్కృతిక వికాసానికి కృషిచేయడం.


The State unit of Jana Vignana Vedika which is striving to create awareness among people about the importance of science with the objectives of science for the people, science for the progress and science for self-reliance and also to impress them about the evils of superstitions since its inception1988 has been selected winner of National Award for Best Efforts for Science and Technology Communications for the year 2005. JVV is undertaking several programs like seminars, workshops, science fairs, training camps to inculcate the spirit of scientific temper in the society. Also JVV Championed many social tasks like literacy movement, prohibition of arrack, against fish medicine, Cool Drinks. JVV derives its strength from all sections of the society including scientists, professors, lecturers, teachers, doctors and many social activities. Besides JVV is running an exclusive 'Children's Science 'CHEKUMUKI' in Telugu since 1990. JVV has also published many books for the enhancement of children's creativity.

మానవాళికి వెలకట్టలేని సేవ చేసిన లూయీ పాశ్చర్

 ప్రముఖ ఫ్రెంచి జీవ శాస్త్రవేత్త లూయీ పాశ్చర్ జయంతి డిసెంబరు27న  ఆసందర్భంగా ఆమహనీయునికి విజ్ఞానాభివందనాలు అర్పిస్తూ......


పాశ్చర్ ఫ్రాన్స్ లోని డోల్ గ్రామంలో డిసెంబరు 27, 1822లో జన్మించారు.  నెపోలియన్ సైన్యంలో పనిచేసిన తండ్రి జీన్ పాశ్చర్ తోలు వ్యాపారం చేసి జీవించేవారు. పాశ్చర్ పాఠశాలకు వెళ్ళకుండా కొంతవరకు విద్యావంతుడయ్యాడు. చిత్రలేఖనంలో మంచి ప్రతిభ కనపరిచేవాడు. తల్లిదండ్రులతో పాటు ఇరుగుపొరుగు వారివి, స్నేహితులవి బొమ్మలు పెయింట్ చేశాడు. చాలా చిత్రాలు ఇప్పటికీ పాశ్చర్ మ్యూజియంలో భద్రపరచబడ్డాయి. గణితం, భౌతిక, రసాయనిక శాస్త్రాలంటే ఇష్టమున్న పాశ్చర్ ఉపాధ్యాయ జీవితాన్ని గడపాలనుకొనేవాడు. పదహారేళ్ల వయసులో కాలేజీ చదువు కోసం పారిస్ లో అడుగుపెట్టాడు.


డాక్టరేట్ పూర్తిచేసి 1848లో స్ట్రాస్ బర్గ్ విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా నియమితులయ్యారు. యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్ కు వారి అమ్మాయి మేరీ లారెంట్ ను పెళ్లిచేసుకుంటానని అనుమతికోసం లేఖ రాశాడు. 1849 మే 29న వీరిద్దరు పెళ్ళిచేసుకున్నారు. ఆదర్శదంపతుల్లాగా జీవించారు. వీరికి అయిదుగురు పిల్లలు పుట్టినా  టైఫాయిడ్ వల్ల ఇద్దరు, మశూచి వల్ల ఒకరు మరణించారు


వ్యాధులకు కారణం సూక్ష్మక్రిములని కనుగొని రోగ నివారణకు పాశ్చర్ బాటలు వేశారు. టీకాల ఆవిష్కారానికి ఈతడు ఆద్యుడు. మొదటిసారిగా రేబీస్ వ్యాధి కోసం టీకాను తయారుచేశాడు.


చాలా మందికి ఇతడు పాలు ద్వారా వ్యాపించే వ్యాధులను అరికట్టే పద్ధతిని ప్రవేశపెట్టిన వ్యక్తిగా సుపరిచితులు. ఈ పద్ధతిని నేడు పాశ్చరైజేషన్ అంటారు.


ఇతన్ని సూక్ష్మజీవశాస్త్రం వ్యవస్థాపకులైన ముగ్గురిలో ఒకరుగా పేర్కొంటారు; మిగిలిన ఇద్దరు రాబర్ట్ కోచ్ మరియు ఫెర్డినాండ్ కాన్.


ఈతని మరణం తరువాత పారిస్ లోని పాశ్చర్ సంస్థ భూగర్భంలో పాతిపెట్టారు. ఈ ఘనత దక్కిన 300 మంది ఫ్రాన్స్ దేశస్తులలో ఇతడొకడు.


పాశ్చర్ అంగారక పదార్ధాలు ధ్రువిత కాంతిని ఏ విధంగా విచలనం చెందిస్తాయో అధ్యయనం చేసి "స్టీరియో కెమిస్ట్రీ" అనే కొత్త రసాయన శాస్త్రాన్ని రూపొందించారు. తరువాత తన పరిశోధనలను పులియడం (Fermentation) వంటి అంశాలపై కొనసాగించి సూక్ష్మక్రిములపై అనాదిగా ఉన్న భావాలను ఖండించి కొత్త సిద్ధాంతాలను రూపొందించాడు. ద్రాక్షసారా (Wine) వల్ల వచ్చే వ్యాధులు, నిల్వచేసే పద్ధతులు, వెనిగర్ తయారీ మొదలైన అనేక అంశాలపై కొత్త విషయాలు కనుగొన్నాడు.


కోళ్ళకు వచ్చే కలరా వంటి పారుడు వ్యాధిపై పరిశోధన జరిపి వ్యాధికారకాలైన సూక్ష్మజీవులను బలహీనపరచి ఇతర కోళ్ళకు ఎక్కించి వాటిలో రోగనిరోధక శక్తి పెరిగి తర్వాత కాలంలో రోగం రాకుండా రక్షిస్తుందని నిర్ణయానికి వచ్చారు.


పిచ్చికుక్క కాటు వల్ల వచ్చే రేబీస్ వ్యాధికి మందు కనిపెట్టడం పాశ్చర్ సాధించిన శాస్త్ర విజయాలలో ప్రధానాంశం. ఈ మందుతో చాలా మందిని ప్రాణాపాయం నుండి కాపాడాడు.


1870 దశాబ్దంలో టీకా పద్ధతులను పశువులలో వచ్చే ఆంత్రాక్స్ వ్యాధి మీద ప్రయోగించాడు.


ఈ విధంగా కొన్ని ప్రాణాంతక వ్యాధులకు సూక్ష్మక్రిములు కారణాలన్న విషయాన్ని నిరూపించాడు. అందువలన మనిషులు గాని, జంతువులు గాని అంటు వ్యాధితో మరణిస్తే ఆ శవాన్ని దహనం చేయాలని చెప్పారు. భూమిలో పాతిపెడితే శరీరంలోని క్రిములు బయటకు వచ్చి వాటివలన ఇతరులకు ఆ వ్యాధులు వ్యాపిస్తాయని వివరించారు.


పాశ్చర్ సూక్ష్మజీవశాస్త్రంలో అత్యుత్తమ గౌరవమని పిలిచే లీవెన్ హాక్ బహుమతిని1895లో పొందారు.


పాశ్చర్ తన పూర్తి జీవితాన్ని శాస్త్ర పరిశోధనలకు అంకితం చేశారు. సంకల్పబలం, నిరంతర శ్రమతో విజయాన్ని సాధించవచ్చని పాశ్చర్ విశ్వాసం. రెండు సార్లు గుండెపోటు, తరువాత పక్షవాతం వచ్చినా జీవితాంతం పరిశోధన చేసి మానవాళికి వెలకట్టలేని సేవ చేసిన పాశ్చర్ 1895 సెప్టెంబరు 28న పరమపదించారు.


ప్రపంచ పరిణామ దినోత్సవం - నవంబర్ 24

మానవ జాతి విజ్ఞాన అభివృద్ధి ని మలుపు తిప్పిన గొప్ప గ్రంథం *చార్లెస్ డార్విన్* రాసిన *"THE ORIGIN OF SPECIES BY MEANS OF NATURAL SELECTION."*

*1859, నవంబర్ 24* న తొలిసారిగా ప్రచురితమైన రోజును ప్రపంచ వ్యాప్తంగా *" ప్రపంచ పరిణామ దినోత్సవం"* గా జరుపుకుంటారు..


*ఆరిజిన్ ఆఫ్ స్పెసిస్* గ్రంథంలో *చార్లెస్ డార్విన్* ప్రతిపాదించిన *"జీవ పరిణామ సిద్దాంతం"* అప్పటి వరకు జీవుల పుట్టుకకు సంభందించి మానవుల ఆలోచనలను పూర్తిగా మార్చివేసింది. మతగ్రంథాలను  ఖగోళ శాస్త్రం కొట్టిన దెబ్బకన్న జీవశాస్త్రము అందులో జీవ పరిణామ సిద్దాంతం కొట్టిన దెబ్బ చాలా పెద్దది.


చార్లెస్ డార్విన్‌ 1809 ఫిబ్రవరి 12న ఇంగ్లండులోని ష్రూస్‌బరీలో జన్మించాడు. తన కొడుకును మతాధికారిగా చూడాలనుకున్న తన తండ్రి కోరికకు వ్యతిరేకంగా *"హెచ్ ఎమ్ ఎస్ బీగిల్"* అనే వ్యాపార నౌకలో 1831, డిసెంబర్ 27 న బయలు దేరి సుమారు *ఐదు సంవత్సరాలు ప్రయాణం* సాగించి 1836 లో స్వదేశానికి తిరిగి వచ్చాడు. నౌక లంగరు వేసిన ప్రతి ప్రదేశంలో అక్కడి *పక్షులు , చెట్టు మరియు జంతువుల వివరాలను జాగ్రత్తగా సేకరిస్తు* వెళ్ళాడు.


దక్షిణ అమెరికా పశ్చిమ తీరంలో పెరూ దేశానికి దగ్గరగా ఉన్న *గెలాపాగోస్ దీవుల్లో ఫించ్ పక్షి జాతుల్లో తేడాలు గమనించాక* తన డైరీలో  ఇలా రాసుకున్నాడు "ఈ అనంతమైన వైవిధ్యానికి అంతులేని వైచిత్రికి ఒకే ఒక్క కారణం ఉండాలి. ఈ జీవరాసులన్నింటికి పూర్వీకులు ఒకరైతేనే తప్ప , ఈ పోలికలు మరియు తేడాలకు మరో కారణం దొరకదు. కోట్ల సంవత్సరాల క్రితం ఈ పూర్వికులు ఈ భూభాగం నించి దీవులకు వలస వచ్చి క్రమేణా మార్పు చెందుతూ ఎక్కడివి అక్కడ జాతులుగా ప్రజాతులుగా విడిపోయి వుండాలి".


తరతరాలుగా మతం నిర్మించిన అంధ విశ్వాసాలకు నిర్ధాక్షణ్యంగా గోరి కట్టేందుకు వీలు కల్పించిన *"ఆరిజిన్ ఆఫ్ స్పెసిస్"* గ్రంథం వైజ్ఞానిక ప్రపంచంలో గొప్ప సంచలనాన్ని సృష్టించింది. మత విశ్వాసాలకు వ్యతిరేకంగా ఉందనే కారణం తో ఆనాటి మతాధికారులు మతద్రోహంగా పరిగణించారు. తమ కట్టుకథల చిట్టా పుస్తకాల్లో, చిట్టా కథల రెట్ట పుస్తకాలలో  చెప్పిన విదంగా "దేవుడనేవాడు మన్ను మషాణం తన  ఆకారంలో బొమ్మను చేసి ఉఫ్ఫ్ మని గాలి ఊదితే మనిషి పుట్టుకొచ్చాడు" అనే కాకమ్మ కథకు వ్యతిరేకంగా డార్విన్ చెప్పిన మానవ పరిణామం వ్యతిరేకంగా ఉండటం వలన దైవ ద్రోహంగా ప్రకటించారు.  ఈ మత గురువులు సృష్టించిన అల్లకల్లోలం వలన చార్లెస్ డార్విన్ జీవ పరిణామం పై రాసిన అమూల్యమైన పరిశోధన ప్రతులను దాచిపెట్టవలిసి వచ్చింది. ఆయన రాసిన పత్రాలు పూర్తిగా ప్రచురితమై ఉంటే జీవ పరిణామ పరిశోధనలు ఎంతో సులభ సాద్యమై ఉండేవి..


డార్విన్ తన సిద్దాంతాన్ని వెలువరించి 150 సంవత్సరాలు దాటింది. ఆయన తరువాత పరిణామం గూర్చి అనేక పరిశోధనలు జరిగాయి. అనేక నూతన విషయాలు కనుగొన బడ్డాయి. వాస్తవ మైన పరిణామ సిద్దాంతం సజీవంగానే ఉంటుంది. పరిశోధనలు వలన కొత్త ఆంశాలు చేర్చబడుతాయి. ఎందుకు కొరగాని చచ్చు సృష్టివాద సిద్దాంతాలే ఏ మార్పు లేకుండా జీవచ్ఛవాల్లా ఉంటాయి.


వేల ఏళ్ళుగా మత అంధ విశ్వాసాలపై నిద్రిస్తున్న మానవాళిని తట్టి మేల్కోలిపి, సృష్టి గురించి మత గ్రంథాలలోని కట్టుకథలను, మతాధికారులు చేసిన అబద్ధపు ప్రచారాన్ని  కాలదన్ని *ఈ జీవ సృష్టికి దేవుడు కారణం కాదు , కోట్ల సంవత్సరాలుగా జరిగిన సుదీర్ఘ పరిణామమే కారణం* అని శాస్త్రీయంగా నిరూపించిన గ్రంథం మొదటి సారిగా ప్రచురితమైన ఈ రోజున ఆయన్ని మరోసారి స్మరించుకుందాం..


*"ప్రపంచ పరిణామ దినోత్సవ శుభాకాంక్షలు"*

..రాం ప్రదీప్


కార్పొరేట్ పాఠశాలల గురించి అద్భుత హాస్య కథ

 ఫారంకోళ్లు -  ( పెద్దవాళ్ల కోసం) - డా. ఎం. హరికిషన్ - కర్నూలు- 9441032212


          ''ఏరా... ఇంగా స్నానం గూడా చేయకుండా అడ్డగాడిదలెక్క కూచున్నావ్‌. బడికిపోయేదుందా లేదా... మీ చెల్లెలు చూడు అప్పుడే సంచి సంకకెక్కిచ్చుకోనింది'' రాంచంద్‌ చదువుతున్న పేపర్‌ పక్కన పెట్టేసి గట్టిగా అరిచాడు కొడుకుని చూస్తూ.


వాడు ఏమీ పలకలేదు. మన్నుతిన్న పాములెక్క అట్లాగే కూచున్నాడు..


''ఏంరా... ఏమైంది... అట్లావున్నావ్‌'' ప్రశ్నించాడు.


''నేను పోను నాన్నా ఈరోజు'' తలొంచుకొని చిన్నగా గొణిగాడు.


''ఏమండీ... ఈ మధ్య వాడు ఇంతకు ముందులా స్కూలుకు ఇష్టంగా కాక ఏదో భారంగా, దిగులుగా, బలవంతంగా ఎవరో తరుముతున్నట్లు పోతున్నాడు'' రాంచంద్‌ భార్య వంటింట్లోంచి నెమ్మదిగా చెప్పింది.


''అట్లాగా'' అంటూ రాంచంద్‌ వాన్ని అనునయంగా దగ్గరికి తీసుకోని ''వూరికే పోనంటే ఎట్లా... కారణం చెప్పు. ఆరోగ్యం బాలేదా'' మెడకింద చేయిపెట్టి చూస్తూ ప్రశ్నించాడు.


''అదీ... అదికాదు నాన్నా. ఈ మధ్య మా సైన్సుమిస్‌ అయిన్దానికీ కాన్దానికీ వూకూకెనే అందరి ముందు ఇన్సల్ట్‌ చేస్తావుంది. చిన్న చిన్న తప్పులకే పెద్ద పెద్ద పనిష్మంట్లిస్తోంది. నిన్న సైకిల్‌ పంచర్‌ అయి ఐదు నిమిషాలు ఆలస్యంగా పోయేసరికి తిట్లు, తన్నులు... ఆపై ఒన్నవర్‌ బైట్నే నిలబెట్టేసింది. స్కూలుకి పోవాలంఏనే భయంగా వుంది'' ఏడుపు ముఖంతో విచారంగా చెప్పాడు.


''ఎప్పట్నించి జరుగుతుందిలా''


''అదే... నువ్వు నోట్‌బుక్స్‌ బైట తీసుకురావద్దు నాన్నా... స్కూళ్ళోనే కొనుక్కుంటా అని మొత్తుకుంటున్నా వినకుండా బైట్నే తెచ్చినావు చూడు... అప్పట్నించీ''


''అరే! వాడు పది రూపాయల పుస్తకం ఇరవై రూపాయలకమ్ముతుంటే... ఎట్లా కొనాల. డబ్బులేం చెట్లక్కాయడం లేదు గదా వూకివ్వడానికి. ఐనా ఎక్కడైతే ఏం. వాళ్ళు చెప్పిన నోట్సులన్నీ తెచ్చిచ్చినా గదా... ఇంగేమంట''


''నీకేం నాన్నా... మస్తుగ చెబుతావ్‌. నీ ముందేమీ అనరు. ఎక్కడైనా తెచ్చుకోవచ్చు. మీరు తెచ్చుకోకుంటే మేం ఇస్తాం. అంతే... అంటారు వినయంగా. కానీ తర్వాతుంటాది తెచ్చుకున్నోళ్ళకి''.


''సర్లే... సర్లే.. ఈరోజుకి నువ్వుపో... ఇంకోసారిలా జరగకుండా నేనొచ్చి మాట్లాడ్తాలే మీ కరెస్పాండెంట్‌తో'' అంటూ వానికి నచ్చచెప్పి పంపించేశాడు.


టిఫిన్‌ తిని, స్నానం చేసి ఆఫీసుకు అర్ధరోజు సెలవు పెట్టి, పెళ్ళాన్ని వాళ్ళ ఆఫీస్‌ దగ్గర దింపి స్కూల్‌ వైపు బయలుదేరాడు.


స్కూలు ఇంటికి రెండు కిలోమీటర్ల దూరంలో వుంది. ఇద్దరినీ సెమీ రెసిడెన్షియల్‌ పద్దతిలో చేర్పించాడు. పొద్దున్నే ఆరుకల్లా బీక్యాంప్‌ దగ్గరికి బస్సొచ్చేస్తుంది. పొద్దున టిఫిన్‌, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్‌ అంతా వాళ్ళే చూసుకుంటారు. స్నానం చేపించి బస్సెక్కిస్తే చాలు. సాయంత్రం స్కూలయిపోగానే అక్కన్నే ట్యూషన్‌, వెనకబన్న సబ్జెక్స్‌లో ప్రత్యేక శిక్షణ ఇస్తారు. హోంవర్కును కూడా వాళ్ళే చేయిస్తారు. ఇంటికి చేరుకునే సరికి ఏడున్నరో, ఎనిమిదో అవుతుంది. ఆదివారాలు గూడా ఎక్స్‌ట్రా క్లాసులు మధ్యాహ్నం దాకా తీసుకుంటారు. పిల్లలకు ఇంగ్లీష్‌ బాగా రావడానికి టీచర్లతో గానీ, స్నేహితుల్తో గానీ స్కూలు కాంపౌండ్లో తెలుగులో మాట్లాడ్డం నిషేధించారు.


ఇద్దరూ వుద్యోగస్థులే కావడంతో రాంచంద్‌కు ఇవి బాగా నచ్చేశాయి. దాంతో దూరమయినా ఫీజులెక్కువయినా అందులోనే చేర్పించాడు. ఆలోచనల్లోనే స్కూలొచ్చేసింది. లోపలికి అడుగుపెట్టాడు.


యూ షేప్‌లో కట్టబడిన మూడంతస్తుల తరగతి గదులు. మధ్యలో శుభ్రంగా మెరిసిపోతున్న విశాలమైన గ్రౌండ్‌. చుట్టూ పచ్చని చెట్లు, పూలమొక్కలు, మెత్తటిలాన్‌, మధ్యలో వివిధ రకాల ఆటల కోర్టులు, తగిలించిన నెట్లు, కుడివైపు చివరన వరుసగా నిలుచున్న పసుప్పచ్చని స్కూలు బస్సులు.


దాదాపు మూడు వేల మంది విద్యార్థులున్నా తరగతి గదుల్లో పిల్లలున్నారా లేక సెలవు రోజా అనేది చెప్పలేనంత శ్మశాన ప్రశాంతత వుందక్కడ.


ప్రారంభంలోనే కరస్పాండెంట్‌ గది. రిసెప్షన్లో ఇరవైయేళ్ళ యువతి చిరునవ్వుతో వివరాలడిగి ''సారు లోపల వాళ్ళ స్నేహితునితో ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడ్తున్నారు. కాసేపు వెయిట్‌ చేయండి'' అంటూ సిటవుట్‌లో కుర్చీ చూపించింది. రాంచంద్‌ టైం చూసుకుంటూ కుర్చీలో కూర్చున్నాడు.


జ జ జ జ జ


కరస్పాండెంట్‌ గది అందంగా నీలంరంగు పెయింట్‌తో ఆహ్లాదంగావుంది. ఎయిర్‌ కండిషన్‌ మల్లెపూల వాసనను నలుమూలలా వెదజల్లుతూ గదిని నిశబ్దంగా చల్లబరుస్తూ వుంది. గోడలపై అందమైన పెయింటింగ్స్‌ వేలాడుతూ వున్నాయి. కుడివైపునున్న షోకేష్‌లో రకరకాల షీల్డులు స్కూలు గొప్పతనాన్ని గర్వంగా చూపిస్తున్నాయి.


కరస్పాండెంట్‌ కుర్చీలో వున్న శేఖర్రెడ్డి చిన్నగా నవ్వుతూ ''రేయ్‌,... ఏందీ... నువ్వు స్కూలు పెట్టాలను కుంటున్నావా... నిజమా... ఐనా ఇట్లా అందరూ స్కూళ్ళు పెడ్తాపోతే మాలాంటివాళ్ళంతా ఏమైపోవాల. ఐనా హఠాత్తుగా ఎందుకిట్లా ఈ వైపుకి గాలి మళ్ళింది'' అన్నాడు.


ఎదురుగా కూచున్న శ్రీనివాసనాయుడు ''అది గాదు శేఖరు... తమాషాక్కాదు సీరియస్‌గానే అంటున్నా. ఈ మధ్య చికున్‌గన్యా వచ్చి యాపారం ఒక్కసారిగా నున్నగా నూక్కపోయింది. గిట్టుబాటు కాకపోయినా ఎదిగిన కోళ్ళను ఏం చేయాల్నో తెలీక అయినకాడికి అమ్మేసుకొంటి. ఆదినం నుండి ఏం యాపారం చేద్దామా అని ఆలోచిస్తావుంటే మా బామ్మర్ది గాడు ''కోళ్ళఫారానికీ, కాన్వెంటు స్కూలుకీ పెద్ద తేడా లేదు బావా... కోడిపని తినడం గుడ్లు పెట్టడం. స్టూడెంటు పని చదవడం మార్కులు సంపాదించడం. కోళ్ళఫారంలో కోళ్ళనెట్లయితే పద్ధతి ప్రకారం గదుల్లో బంధించి పెంచుతామో, కాన్వెంటు స్కూళ్ళో కూడా పొట్టెగాళ్ళను అట్లాగే బంధించి చదివించాలంతే... మాగాణిని నమ్ముకున్నోడు కాన్వెంటు స్కూలుని నమ్ముకున్నోడు ఎన్నటికీ చెడిపోడు గుర్తుంచుకో'' అని సలహా ఇచ్చినాడు. ఆ రోజు నుండి ఇదే ఆలోచన. నువ్వయితే చాలా దినాల్నుండీ ఈ యాపారంలో వున్నావు గదా... లోతుపాతులు బాగా తెలిసుంటాయి. అందుకని నీ దగ్గరికొస్తి'' అంటూ వున్నదున్నట్టు చేప్పేశాడు.


''సర్లే... సర్లే... ఐనోనివి. పైగా కాలేజీలో కంచం పంచుకున్నోనివి. నీకుగాకపోతే... ఇంగెవరికి సాయం చేస్తాగానీ...ఇంతకీ ఏం చేయాల్నో చెప్పు'' అడిగాడు.


''అచ్చరాలు రానోన్ని వాక్యాలు రాయమన్నట్లు అసలేమన్నా తెలిసేడిస్తే గదా అడగడానికి... చానా పెద్ద పెట్టుబడితో దిగాలనుకుంటున్నా గాబట్టి అసలీ యాపారం నమ్మకమేనా... గాదా... ముందది చెప్పు'' అన్నాడు.


శేఖర్రెడ్డి ఒక్క నిమిషం ఆలోచించి ''నీ దగ్గర నేను దాచి పెట్టేదేముంది గానీ... వున్నదున్నట్టు చెబుతా విను. దోచుకున్నోనికి దోచుకున్నంతని... తెలివుండాలే గానీ బంగారు బాతులాంటిదీ యాపారం. నెలనెలా ఫీజులేగాక, ట్యూషన్సనీ, స్పోకెన్‌ ఇంగ్లీష్‌ కోర్సనీ, ఐదోతరగతి నుంచే ఐఐటి కోచింగనీ, కంప్యూటర్స్‌ స్పెషల్‌ ట్రయినింగనీ, మధ్య మధ్యలో స్టడీ టూర్లనీ, ఎస్కర్షన్లనీ, ఎండాకాలంలో సమ్మర్‌ క్యాంపనీ ఇట్లా పైన చానా సంపాదించొచ్చు. వీలైతే క్యాంపస్‌లోనే క్యాంటీన్‌, బుక్‌షాప్‌ గూడా రన్‌ చేయొచ్చు. దీంతో బాటు నోట్‌బుక్స్‌, టెక్ట్స్‌బుక్స్‌, స్కూల్‌ డ్రస్సు, స్కూలుబస్సు వుండనే వున్నాయి. మరోపక్క డిసిప్లిన్‌ పేరుతో లేట్‌గా వస్తే ఫైన్‌, క్లాసులో అల్లరి చేస్తే ఫైన్‌, పరీక్షల్లో మార్కులు తగ్గితే ఫైన్‌, బడికి ఆబ్సెంటయితే ఫైన్‌ ఇట్లా అనేకం వసూలు చేసుకోవచ్చు. డేస్కాలర్సేగాక రెసిడెన్సియల్‌, సెమీ రెసిడెన్సియల్‌ నడిపితే ఇంకా లాభం. దిగుతే గానీ లోతు తెలీదన్నట్లు ఎన్నని చెప్పనులే. కానీ ఏది చేసినా కోడికి తెలీకుండా గుడ్డును నూకేసినట్లు, నొప్పి తెలీకుండా సూదేసినట్లు జరిగిపోవాల. అన్నీ వాళ్ళకోసమే చేస్తున్నట్లు బిల్డప్పియ్యాల'' అన్నాడు.


ఆ మాటలన్నీ నోరెళ్ళబెట్టుకోని విన్న శ్రీనివాసనాయుడు ''కానీ... ఇప్పటికే ప్రయివేట్‌ ఆస్పత్రుల్లెక్క అడుగడుగునా స్కూళ్ళున్నాయి గదా... మధ్యలో నాది సక్సెస్‌ అవుతుందంటావా'' అనుమానంగా ప్రశ్నించాడు.


ఆ మాటలకు శేఖర్రెడ్డి శ్రీనివాసనాయుని భుజం తడుతూ ''చిన్న చిన్న స్కూళ్ళయితే లాభం లేదు నాయుడూ... పెట్తే మల్టీ స్టారర్‌ సినిమాలెక్క భారీ పబ్లిసిటీతో పెద్ద ఎత్తున కొత్తగా ఎదుగుతున్న కాలనీల్లో అడుగుపెట్టాల. అడ్మినిస్ట్రేషన్‌లో మంచి అనుభవమున్న హెడ్‌ మాస్టర్నొకర్ని అధికమొత్తంలో ఆశ చూపి నీ దాంట్లోకి లాగెయ్యాల. బస్సుల్తో చుట్టు పక్కల పల్లెల మీద, వీధుల మీద పడాల. కార్పొరేట్‌ హాస్పిటళ్ళు ఆర్‌.యం.పి. డాక్టర్లకు వలేసి కేసులు పడ్తున్నారు చూడు అట్లా పల్లెల్లో బ్రోకర్లని పట్టాల. పదిమందిని చేర్పిస్తే మీ పిల్లోనికి ఫ్రీ లాంటి పథకాలు రహస్యంగా ప్రకటించాల. స్కూలుకి గూడా మంచి పేరు పెట్టాల.


నీ చిన్న కూతురి పేరు సృజనే గదా. ఆపాప పేరు మీదనే సృజనా కాన్సెప్ట్‌ స్కూల్‌ అని పెట్టు అదిరిపోతాది... అసలు...''


మాటల మధ్యలో శ్రీనివాసనాయుడు అడ్డు తగులుతూ ''కాన్సెప్ట్‌ స్కూలా అంటే ఏ కాన్సెప్ట్‌ అయితే బాగుంటుంది'' ప్రశ్నించాడు.


''కాన్సెప్టా... మన్నా... ఇప్పుడది లేటెస్ట్‌ స్టైల్‌... అంతే... ఏ కాన్సెప్ట్‌ లేకపోవడం గూడా ఒక కాన్సెప్టే. అంతగా ఎవరైనా తలమాసినోడు అడిగినా కోడి గుడ్డును పొదిగినంత జాగ్రత్తగా మీ పిల్లల్ని మీరు కలలు కంటున్నట్టు పెంచి పెద్ద చేయడమే మా కాన్సెప్ట్‌ అని చెప్పు. స్కూలు సింబల్‌ గూడా ముద్దులొలికే చిన్న పిల్లలను రెక్కల కింద జాగ్రత్తగా పొదువుకున్న కోడి బొమ్మ పెట్టు. కరెక్టుగా సరిపోతుంది'' గట్టిగా నవ్వుతూ అన్నాడు.


నవ్వుల మధ్యలోనే ''ఎక్స్‌క్యూజ్‌మీ సర్‌'' అనే సెక్రటరీ పిలుపు వినబడింది. ఏమన్నట్లుగా చూశాడు.


''రాంచందని తొమ్మిదో తరగతి 'ఎఫ్‌' సెక్షన్లోని వెంకటేష్‌ ఫాదర్‌.''


''ఏమంట... విషయం''.


''అదేసార్‌.. నోట్‌బుక్స్‌ బైట తెచ్చుకున్నాడు... ఈయనే''


శెఖర్రెడ్డికి విషయమంతా అర్థమయిపోయింది. ''సరే... ముందు ఆ పిల్లోవాని రిపోర్ట్సివ్వు'' అన్నాడు. రిపోర్ట్స్‌ రాగానే అన్నీ చదివి ''నాయూడూ... అప్పుడప్పుడూ కొంత మంది పంటికింద రాయిలెక్క మన యాపారానికి అడ్డుపడుతూ వుంటారు. ఇప్పుడు లోపలికొచ్చేటోడు కూడా అట్లాంటోడే. నోట్‌బుక్స్‌ ఎక్కువ రేటుకి అమ్ముతున్నామని బైట తెచ్చుకున్నాడు. ఇట్లాంటోళ్ళ పిల్లల్ని సతాయించడానికి ఒకర్ని పెట్నాం. పిల్లలు విసిగి విసిగి ఇంట్లో గొడవ చేసింటారు. అందుకే మన మీదికి వచ్చింటాడు. ఇట్లాంటోళ్ళని ఎట్లా డీల్‌ చెయ్యాల్నో కాస్త గమనించు. ముందు ముందు పనికొస్తాది'' అంటూ సెక్రట్రీని పిలిచి లోనికి పంపియ్యమన్నాడు.


రాంచంద్‌ లోపలికి అడుగు పెడుతుండగానే ''రండి... రండి... నేనే మిమ్మల్ని పిలిపిద్దామనుకుంటుంటే మీరే వచ్చినారు'' కుర్చీ చూపిస్తూ గంభీరంగా అన్నాడు.


''ఏంసార్‌... విషయం'' కన్‌ఫ్యూజవుతూ ప్రశ్నించాడు రాంచంద్‌.


''ఈ మధ్య మీ పిల్లోని మీద చానా కంప్లయింట్స్‌ వస్తున్నాయి. సరిగా చదవడం లేదనీ, శ్రద్ధగా వినడం లేదనీ, లేట్‌గా వస్తున్నాడనీ, మార్కులు తగ్గిపోతున్నాయనీ... ఇంతకూ ఏమి సమస్య. ఇంట్లో ఏమన్నా ప్రాబ్లమ్సున్నాయా'' ప్రశ్నించాడు.


తాను కంప్లయింట్‌ చేయాలని వస్తే తననే సంజాయిషీ అడుగుతూ వుండడంతో కొంచం సేపు రాంచంద్‌కు ఏం మాట్లాడాల్నో అర్థంగాలేదు. అంతలో పొద్దున కొడుకు చెప్పిందంతా గుర్తుకొచ్చి ''అదీ... వాళ్ళ సైన్సు మిస్‌ అనవసరంగా చిన్న చిన్న దాండ్లకే పనిష్‌మెంట్‌ ఇస్తున్నదంట ఈ మధ్య... దాంతో వాడు మానసికంగా డిస్టర్బ్‌ అవుతున్నాడు. ఆమె పై మీరు...''


మాటల మధ్యలోనే శేఖర్రెడ్డి అడ్డుపడుతూ ''చూడండ్సార్‌... టీచర్ల మీద కంప్లయింట్‌ చేసే ముందు ఎద్దు ఈనిందంటే దూడను కట్టెయ్యమన్నట్లు గాక కాస్త వెనుకాముందు ఆలోచించి చెయ్యాల. ఈ ఇన్‌స్టిట్యూషన్‌ ప్రారంభించినప్పటి నుండీ వుందామె. ఎంత సిన్సియర్‌ గాకపోతే కొనసాగిస్తాం ఇంత కాలం. ఐనా మీ పిల్లవానిపై ఆమెకేం కోపం. మీకు మీకు ఏమయినా పగలూ ప్రతీకారాలూ వున్నాయా'' ప్రశ్నించాడు.


''అదిగాదు... ఈ సమ్మచ్చరం నోట్‌బుక్స్‌ ఇక్కడగాక బైట కొనుక్కొచ్చుకున్నాం గదా... అది మనసులో పెట్టుకోని...''


''నోట్‌బుక్స్‌ బైట తెచ్చుకుంటే కోపం మాకుండాల గానీ ఆమెకెందుకు. ఆమేమీ మా పార్ట్‌నర్‌ కాదు గదా... కేవలం ఒక టీచర్‌. ఏదయినా లాజికల్గా ఆలోచించాల. ఇట్లా నిజానిజాలు ఆలోచించకుండా పిల్లలను వెనకేసుకొస్త్తే రేప్పొద్దున వాళ్ళు మామాటేం వింటారు. మేమిలాంటివి ఇక్కడ అనుమతించం. మీకంతగా ఇబ్బందనిపిస్తే వేరే స్కూలు చూసుకోండి. మాకభ్యంతరం లేదు. మేం కాస్త అర్జంట్‌ మీటింగ్‌లో వున్నాం. మీరు ఆలోచించుకోని మళ్ళా కలవండి'' అంటూ రాంచంద్‌ మాట్లాడ్డానికి అవకాశమివ్వకుండా ముగించేశాడు.


రాంచంద్‌కు దిక్కు తోచలేదు. బలవంతంగా చిరునవ్వు మొగమ్మీదకు తెచ్చుకోని బైటకు నడిచాడు.


అదంతా చూస్తున్న శ్రీనివాసనాయుడు రాంచంద్‌ బైటికి పోగానే ''అరెరే... అదేంది అట్లా డైరెక్టుగా చెప్పేశావు. టీసీ తీస్కోని పోతే ఎట్లా'' ప్రశ్నించాడు.


శేఖర్రెడ్డి చిన్నగా నవ్వుతూ ఇప్పుడు ''కోళ్ళఫారంలో ఒక కోడికి తెగులొచ్చిందనుకో... అది మిగతాదాండ్లకి అంటుకోకముందే నువ్వేం చేస్తావు... ఇదీ అంతే... అర్థమైందా'' అన్నాడు.


ఆ మాటలకు శ్రీనివాసనాయుడు అర్థమైందన్నట్లుగా తలూపుతూ ''కరెక్టే... ఇట్లాంటోళ్ళు వుండకపోవడమే మంచిది. వున్నా ఈ దెబ్బతో మళ్ళీ ఎప్పుడూ కంప్లయింట్‌ చేయడు'' అంటూ నవ్వేశాడు.

**************************

డా.ఎం.హరికిషన్ - కర్నూల్ - 9441032212

**************************

కథ నచ్చితే *SHARE* చేయండి. రచయిత పేరు తీసేయకండి. మార్చకండి.


నరేంద్ర దభోల్కర్ - హేతువాద ఉద్యమ స్ఫూర్తి

     ఈరోజు హేతువాద ఉద్యమ స్ఫూర్తి,హేతువాదాన్ని ఆచరించి చూపిన వాడు,అంధ విశ్వాసాల నిర్మూలనకు కృషి చేసిన వాడు, వైద్యుడు నరేంద్ర దభోల్కర్ వర్ధంతి సందర్భంగా... ఆగస్ట్20


       నరేంద్ర అచ్యుత్ దభోల్కర్(Narendra Dabholkar) (1945 నవంబరు 1 – 2013 ఆగస్టు 20) ఒక భారతీయ హేతువాది మరియు మహారాష్ట్రకు చెందిన రచయిత. అంధవిశ్వాసాలకు వ్యతిరేకంగా గళం విప్పి వాటి నిర్మూలనకు "మహారాష్ట్ర అంధశ్రద్ధ నిర్మూలన సమితి " (MANS) స్థాపించాడు. అంధవిశ్వాసాలకు వ్యతిరేకంగా అవిశ్రాంతంగా పోరాడాడు.


ప్రారంభ జీవితం 


           దభోల్కర్ 1945 నవంబరు 1 లో అచ్యుత్ మరియు తారాబాయి దంపతులకు జన్మించాడు. వీరికి 10 మంది సంతానం. కనిష్ఠ కుమారుడు నరేంద్ర దభోల్కర్. జ్యేష్ఠ కుమారుడైన దేవదత్త దభోల్కర్ ప్రముఖ గాంధేయవాది, సామాజిక వేత్త మరియు విద్యావేత్త. సతారా మరియు సాంగ్లీలలో దభోల్కర్. విద్యాభ్యాసం జరిగింది. వైద్యపట్టా 'మీరజ్' మెడికల్ కాలేజినుండి పొందాడు.ఇతను షైలాను వివాహమాడాడు. వీరికి ఇద్దరు సంతానం, కొడుకు హమీద్, కుమార్తె ముక్తా దభోల్కర్. తన కుమారునికి ప్రముఖ సంఘసంస్కర్త హమీద్ దల్వాయ్ పేరును పెట్టాడు.


           శివాజీ విశ్వవిద్యాలయంలో కబడ్డీ కేప్టన్ గా ఉన్నాడు. ఇతడు భారత్ తరపున బంగ్లాదేశ్ లో కబడ్డీ టోర్నమెంటులో పాల్గొన్నాడు. ఇతడికి మహారాష్ట్ర ప్రభుత్వంచే " శివ ఛత్రపతి యువ పురస్కారం " లభించింది.


సామాజిక కార్యకర్తగా 


    వైద్యుడిగా 12 సం.లు పనిచేసిన తరువాత దభోల్కర్ సామాజిక రంగంలో 1980 లో ఉద్యమించాడు.బాబా అధవ ఉద్యమమైన వన్ విలేజ్ - వన్ వెల్ లాంటి సామాజిక న్యాయ ఉద్యమాలలో పాల్గొన్నాడు.


            ఆ తరువాత దభోల్కర్ అంధవిశ్వాసాలను రూపుమాపాలనే దృష్టితో అఖిలభారతీయ అంధశ్రద్ధా నిర్మూలన సమితిలో చేరాడు. 1989 లో 'మహారాష్ట్ర అంధశ్రద్ధా నిర్మూలన సమితి ' ని స్థాపించి అంధవిశ్వాసాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు నడిపాడు. మాంత్రిక తాంత్రికుల క్షుద్రవిద్యలకు వ్యతిరేకంగా పనిచేశాడు.దేశంలో 'గాడ్ మెన్ ' లుగా ప్రసిద్ధి చెందిన సాధువులనూ వారి లీలలను, మాంత్రిక శక్తులనూ ఖండించాడు మరియు విమర్శించాడు, వారి శిష్యులనూ భక్తగణాలనూ విమర్శించాడు. సతారా లోని "పరివర్తన్" సంస్థకు స్థాపక సభ్యుడు. ప్రముఖ భారతీయ హేతువాద సంస్థ యైన సనల్ ఎదమరుకుతో సమీప సంబంధాలను కలిగి ఉన్నాడు. సానే గురూజీ స్థాపించిన మరాఠీ వారపత్రికైన "సాధన"కు దభోల్కర్ ఎడిటర్. భారతీయ హేతువాద సంఘానికి ఉపాధ్యక్షుడిగానూ సేవలందించాడు. 1990–2010 మధ్యకాలంలో దభోల్కర్ దళితుల సమానత్వంకోసం మరియు అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడాడు, మరాఠ్వాడా విశ్వవిద్యాలయానికి 'బాబాసాహెబ్ అంబేద్కర్ ' పేరును పెట్టడం కోసం పోరాడాడు. అంధవిశ్వాసాలూ వాటి నిర్మూలన గురించి పుస్తకాలు వ్రాసాడు. మరియు దాదాపు 3000 పైగా సభలను ఉద్దేశించి ప్రసంగించాడు. హోళీ సందర్భంగా ఆసారాం బాపూ ను విమర్శించాడు. మహారాష్ట్రలో తీవ్ర కరవు అలుముకుని ఉంటే హోళీ పండుగ సందర్భాన అతని శిష్యగణానికి నీటిని వృధా చేస్తున్నందున తీవ్రంగా వ్యతిరేకించాడు.


అంధవిశ్వాస మరియు క్షుద్రవిద్య వ్యతిరేక బిల్లు 


       2010 దభోల్కర్ అనేక పర్యాయాలు మహారాష్ట్రలో "అంధవిశ్వాసాల వ్యతిరేక బిల్లు" తేవడానికి ప్రయాసపడ్డాడు, కాని విజయం పొందలేక పోయాడు. ఇతని ఆధ్వర్యంలో "జాదూ టోనా వ్యతిరేక బిల్లు" (Anti-Jaadu Tona Bill ) ముసాయిదా తయారైంది. ఈ బిల్లును హిందూ తీవ్రవాద సంస్థలు, హిందూ ఛాందసవాదులూ, అభ్యుదయ వ్యతిరేక వాదులూ తీవ్రంగా వ్యతిరేకించాయి, అలాగే వర్కారీ తెగ కూడా వ్యతిరేకించింది.రాజకీయ పార్టీలైన భారతీయ జనతా పార్టీ, శివసేన మొదలగు పార్టీలూ వ్యతిరేకించాయి. ఈ బిల్లు వలన భారతీయ సంస్కృతి, విశ్వాసాలు మరియు ఆచారాలు దెబ్బతింటాయని వాదించాయి. విమర్శకులైతే ఇతడిని "మతవ్యరేకి"గా అభివర్ణించారు. ఫ్రాన్స్ ప్రెస్ ఏజెంసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో దభోల్కర్ ఇలా అన్నాడు "ఈ బిల్లులో ఒక్క పదమైనా దేవుడు లేదా మతం అనేవాటికి వ్యతిరేకంగానూ లేదా గురించినూ లేదు. ఇలాంటిదేమీ లేదు. భారత రాజ్యాంగం మతపరమైన హక్కును స్వాతంత్ర్యాన్ని ఇచ్చింది, ఎవరైనా ఏ మతమైనా అవలంబించవచ్చును, కానీ ఈ బిల్లు, అంధవిశ్వాసాలకూ, మరియు ద్రోహపూరిత ఆచారాలగూర్చిమాత్రమే.


        మరణానికి కొద్ది వారాలకు ముందు దభోల్కర్ ఈ బిల్లు గురించి చర్చే జరగలేదు, ఎన్నోసార్లు శాసనసభలో ప్రవేశపెట్టబడిననూ చర్చలకు నోచుకోలేదని విమర్శించాడు. మహారాష్ట్రలో అభ్యుదయ భావాలకు ముఖ్యమంత్రి చవాన్ తీవ్ర అడ్డంకిగా తయారయ్యాడనీ విమర్శించాడు. దభోల్కర్ హత్య జరిగిన ఒకదినం తరువాత, మహారాష్ట్ర కేబినెట్ ఈ "జాదూ టోనా వ్యతిరేక-బిల్లు"ను ఆర్డినెన్స్ ద్వారా పాస్ చేసింది.


హత్య 


      దభోల్కర్ అనేక హత్యాబెదిరింపులకు ఎదుర్కొన్నాడు. 1983 నుండి అనేక అవమానాలనూ భరించాడు. పోలీసుల భద్రతను వద్దన్నాడు.


         "ఒకవేళ నేను నాదేశంలో నా ప్రజల మధ్య పోలీసుల భద్రత తీసుకుంటే, ఇందులో నాలోనే ఏదో దోషం ఉన్నట్లు, నేను భారతీయ రాజ్యాంగ చట్టాల ద్వారానే ఎవరితోనూ కాదుగాని, అందరికోసం పోరాడుతున్నాను."

- పోలీసుల భద్రతను నిరాకరిస్తున్న సంధర్భంగా

నరేంద్ర దభోల్కర్


          2013 ఆగస్టు 20 న హత్య గావింపబడ్డాడు. ఉదయాన కాలినడక బయల్దేరాడు, ఓంకారేశ్వర్ మందిరం వద్ద గుర్తు తెలియని దుండగులు 7:20 సమయాన ద్విచక్రవాహనంలో వచ్చి తుపాకీతో కాల్చి చంపారు. రెండు బుల్లెట్లు అతని తల మరియు చాతీలోనూ దూసుకుపోయాయి. పుణె లోని ససూన్ వైద్యశాలలో మరణించాడు.


        దభోల్కర్ హత్యను అనేక రాజకీయ పార్టీల నేతలు, సామాజిక వేత్తలు, సంఘ సేవకులు ఖండించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ ఈ హత్యను ఖండిస్తూ, ఈ హత్యా నేరస్తుల గురించి తెలిపిన వారికి 10 లక్షల రూపాయల బహుమానాన్ని ప్రకటించాడు.అనేక రాజకీయ పార్టీలు ఆగస్టు 21 న పుణెలో బంద్ ను ప్రకటించాయి.మరియు పుణె నగరంలోని అనేక సంస్థలు దభోల్కర్ హత్యకు నిరసనగా బందును పాటించి తమ సంస్థలను మూసి ఉంచాయి. చవాన్ 2013 ఆగస్టు 26 న, ఈ హత్య గురించి పోలీసులకు కొన్ని సాక్ష్యాలు లభించాయని ప్రకటించాడు.


దభోల్కర్ కు మరణానంతరం పద్మశ్రీ అవార్డు ప్రకటించారు.


కష్టాలకు కారణం ఏమిటి .... కె ఎల్ కాంతారావు.

     మా తోడల్లుడు రామారావు మణుగూరు లో ఉంటున్నాడు. ఆయనకు ముగ్గురు ఆడపిల్లలు. చిన్న అమ్మాయి పేరు దివ్య. కొన్నేళ్ళ క్రితం మేము వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అప్పుడు దివ్యకు 12ఏళ్లు, ఏడో తరగతి చదువుతోంది. నేను ఒక్కడినే పేపర్ చదువుకుంటూ కూర్చుని ఉన్నాను. అప్పుడు దివ్య మెల్లగా వచ్చి నా పక్కన కూర్చుంది. నేను నవ్వుతూ "బాగా చదువుతున్నావా" అని పలకరించాను. "బాగానే చదువుతున్నాను పెదనాన్న! నాకో సందేహం అడగమంటారా" అంది. "అడుగమ్మా" అన్నాను. మనిషికి డబ్బు కు సంబంధించిన ఇబ్బందులు దేనివలన వస్తాయి? ఆ ఇంటి యజమాని తాగుబోతు అయినందువలనా?  లేక ఆ ఇంటి వాస్తు బాగా లేకనా?" అని అడిగింది దివ్య. నాకు ఆశ్చర్యం, ఆనందం కలిగింది.  "నువ్వే చెప్పు తల్లి" అని ఉత్సాహపరిచాను.

    "ఇంటి యజమాని తాగుబోతు అయితేనే డబ్బుకు ఇబ్బందులు వస్తాయి. దానికి ఇంటి వాస్తు ఏం చేస్తుంది?" అని ప్రశ్నించింది


    "ఇంతకీ నీకు ఈ డౌట్ ఎందుకు వచ్చింది రా" అని అడిగాను.


    "మా వీధిలో సత్యనారాయణ అంకుల్ ఉన్నాడు. ఆయన కూడా మా నాన్నతో సింగరేణి కాలరీస్ లో పని చేస్తాడు.  అయితే ఆయన రోజు బాగా తాగుతాడు. ఆయన అప్పులు చేస్తాడు.  అప్పులు తీర్చలేక నానా అవస్థలు పడుతుంటాడు. అసలు విషయం ఇదయితే ఎవరో ఆయనతో "నీ ఇల్లు వాస్తు బాగో లేదు. అందుకనే నీకీ కష్టాలు.  వాస్తు దోషాలు పోయేట్లుగా ఇంటిలో మార్పులు చేసుకో"  అని చెప్పారట. ఇంకేం ఆయన వాస్తు పండితుణ్ణి ఒకాయన్ని ఇంటికి పిలుచుక వచ్చి ఆయన చెప్పినట్లుగా మార్పులు చేయించాడు. అయినా ఆయన కష్టాలు తీరకపోగా అప్పు పెరిగింది.  అయినా  ఇప్పటికీ ఆయన తన కష్టాలకు కారణం వాస్తు దోషమేనని, ఇంకో పండితుణ్ణి పిలుచుకు వచ్చి ఇల్లు చూపించాలని అనుకుంటున్నాడేగానీ  తన కష్టాలకు అసలు కారణం తన తాగుడు అని అర్థం చేసుకోలేకపోతున్నాడు పెదనాన్నా" అంది.


    "అమ్మా! చిన్న దానివైనా  చాలా శాస్త్రీయంగా ఆలోచిస్తున్నారా!  నీకున్నంత శాస్త్రీయ దృక్పథం చాలామంది పెద్ద వాళ్లకు లేకపోవడమే మనదేశ దుస్థితికి కారణం రా!" అన్నాను బాధగా.  

నా మాటలు తనకు అర్థమైనట్టుగా ఒక చిరునవ్వు నవ్వి ఇంట్లోకి వెళ్ళింది దివ్య.


జనగాం జ్యోతిష్కుడు - కె ఎల్ కాంతారావు

 అది వరంగల్ జిల్లా జనగాం పట్టణంలోని ఒక ప్రముఖ లాడ్జి. ఆ లాడ్జి లోని ఒక రూమ్ లో కొంత కాలం నుండి ఒక ప్రముఖ జ్యోతిష్కుడు నివాసముంటూ తన దగ్గరకు వచ్చే ప్రజలకు జ్యోతిష్యం చెబుతున్నాడు.  ఒకరోజు ఒక వ్యక్తి ఆగది లోకి ప్రవేశించాడు.  ఆ వ్యక్తి పెరిగిన గడ్డంచెదిరిపోయిన జుట్టుమాసిన బట్టలతో ఉన్నాడు.  ఎంతో దిగులుగా కనిపిస్తున్నాడు.  అతను జ్యోతిష్కుని ఎదురుగా కూర్చుని తన పుట్టిన తేదీ, కాలంప్రదేశాలున్న  కాగితాన్ని ఇచ్చాడు.  జ్యోతిష్కుడు దాన్ని తీవ్రంగా పరిశీలించి ఏవో లెక్కలు గణించాడు.  తర్వాత వారిద్దరి మధ్య ఈ కింది సంభాషణ జరిగింది. 

జ్యోతిష్కుడు:  అబ్బాయ్! నీ జాతకం ఏం బాగాలేదోయ్!  జాతకం ప్రకారం మీకు ఏ పని మీద మనసు నిలవదు. అందువలన నీకు చదువు అబ్బలేదు.

వ్యక్తి:  అవును స్వామి!  అందుకనే మా నాన్న నన్ను తిడుతుంటాడు.  నాకు ఉద్యోగం చేసి సంపాదనాపరుణ్ణి  కావాలని ఉంది.  నేను సంపాదన పరుణ్ణి అవుతానాఅయితే ఎప్పుడు అవుతాను?

జ్యోతిష్కుడు: నీకు సంపాదన పరుడు అయ్యే యోగం లేదబ్బాయ్! ఏవో చిల్లర పనులు చేస్తుంటావు. కొద్దిగా సంపాదిస్తావు.  చేతిలో పైసా నిలవదు.  అంతా ఖర్చు చేస్తావు.

వ్యక్తి:  మరి నాకు పెళ్లెప్పుడు అవుతుంది?

జ్యోతిష్కుడు:  ఇంకో రెండేళ్ల వరకు పెళ్లి అయ్యే యోగం లేదు.

ఈ మాటలు విన్న వెంటనే ఆ వ్యక్తి రూము తలుపు వద్దకు వెళ్లి "మిత్రులారా రండి!" అని పిలిచాడు.  వెంటనే బిలబిలమంటూ పది, పన్నెండు మంది వ్యక్తులు రూమ్ లోకి ప్రవేశించారు.  వారిలో పోలీసులు, స్థానిక విలేకరులు, జన విజ్ఞాన వేదిక కార్యకర్తలు ఉన్నారు.  వారికి ఆ వ్యక్తితనకూ జ్యోతిష్కుని కి మధ్య జరిగిన సంభాషణను వివరించాడు.  వారందరూ పెద్దగా నవ్వసాగారు.  జ్యోతిష్కుడు జరుగుతున్న సంఘటనను పరికించసాగాడు. అతనికి ఏమీ అర్థం కావడం లేదు.  అసలు పోలీసులు కూడా ఎందుకు వచ్చారో అతనికి అంతుబట్టడం లేదు. చివరికి బయటి నుండి వచ్చిన వారిలో ఒక వ్యక్తి ఈ విషయాన్ని జ్యోతిష్కుని వివరించాడు. "స్వామి! మేమందరం నీ జ్యోతిష్య బండారాన్ని బయట పెడదామనుకున్నాం.  అందుకని ఈయనను ముందుగా పంపాం. ఆయన నీవు అనుకున్నట్లు చదువు రాని వ్యక్తి కాదు.  ఆయన డాక్టర్ గోపాలరెడ్డి ఎంబిబిఎస్ పైన ఎం.డి. చదివారు.  ఆయన కొన్నేళ్లుగా ప్రాక్టీస్ చేస్తున్న డాక్టరు.  నీవన్నట్లు చేతిలో డబ్బులు లేని వ్యక్తి కాదు.  ఒక ఇల్లు, బ్యాంకులో డబ్బు ఉన్న వ్యక్తి.  పెళ్లి కోసం ఇబ్బంది పడటం లేదు.  పెళ్లి అయ్యి ఇద్దరు బిడ్డల తండ్రి.  నీవు మనిషి వేషభాషలను బట్టి, వారిని అంచనా వేసి నీకు తోచినది చెబుతావని ఇప్పుడు రుజువైంది. అంతే కానీ గ్రహాలు, గ్రహణాలకు నీ జ్యోతిషానికి సంబంధమే లేదు.  ఇక పోలీసులు, విలేకరులు కూడా ఎందుకు వచ్చారు అంటే నీ బండారం బయట పడ్డందుకు నీవు కోపం తెచ్చుకుని అల్లరి చేస్తావేమోనని, ఏ గొడవా లేకుండా ఉండటానికి పోలీసులను రమ్మని మేమే కోరాము. విషయం పదిమందికి చెప్పడానికి విలేకరులను కూడా పిలిచాము. 

నీ జ్యోతిష్క పాండిత్యాన్ని గూర్చి ఇప్పుడు ఏమంటావు అని ముగించారు.

జ్యోతిష్కుడు తన పొట్ట కోసం ఇలాంటి మాటలు చెబుతుంటాననితనను క్షమించమనిక్షమిస్తే ఊరు విడిచి వెళ్లిపోతానని వారిని కోరాడు.  "మోసం చేయకుండా నీతిగా బతుకు" అని వారు అతన్ని హెచ్చరించి వెళ్ళిపోయారు.  జ్యోతిష్కుడు ఆ రాత్రే ఊరు విడిచి వెళ్ళిపోయాడు.

పర్యావరణంపై మార్క్స్‌.

 

          'ప్రకృతిలో భాగంగానే మనిషి మనుగడ సాగిస్తున్నాడు. కాబట్టి ప్రకృతి మనిషి దేహమే. మానవజాతి అంతరించిపోకుండా ఉండాలంటే మనిషి ప్రకృతితో నిరంతరం సంభాషిస్తూ ఉండాలి. సంబంధం కలిగి ఉండాలి. మనిషి భౌతిక, మానసిక జీవితం ప్రకృతితో ముడిపడి ఉంటుందని అంటున్నామంటే ప్రకృతి తనతో తాను ముడిపడి ఉందని అర్ధం, ఎందుకంటే మనిషి ప్రకృతిలో భాగమే'. 'చేప' సారాంశం నీటిలో దాని అస్తిత్వమే. 'మంచి నీటి చేప' సారాంశం నది లోని నీరు. ఒకసారి ఆ నదిని పరిశ్రమ అవసరాల కోసం వినియోగించడం మొదలు పెట్టాక, పరిశ్రమల నుండి వెలువడే రసాయనాలతో, వ్యర్థ పదార్థాలతో, మరపడవలతో ఆ నది కలుషితం అయిన తర్వాత, లేదా ఆ నది నీటిని వేరే అవసరాల కోసం పక్కకు మళ్లించిన తర్వాత చేప అస్తిత్వానికి అవసరమైన మాధ్యమం లేకుండా పోతుంది. అంటే చేప తన అస్తిత్వాన్ని కోల్పోతుంది'.


    'లండన్‌ లోని 45 లక్షల మంది ప్రజలు తమ విసర్జనలతో థేమ్స్‌ నదిని కలుషితం చేయడం మినహా చేయగలిగిందేమీ లేదు. దాని మూల్యం మాత్రం భారీగా ఉంటుంది'.

'ఒక సమాజం మొత్తంగానీ, ఒక యావత్తు దేశం గానీ, లేదా భూమిపై ఉన్న మొత్తం సమాజాలన్నీ కలుపుకున్నాగానీ వారు భూమికి యజమానులు కారు. కేవలం ఆ భూమిపై గల వనరులను వినియోగించుకోవడం, దాని ప్రయోజనాలు పొందడం మాత్రమే వారు చేయాలి. తమ తరువాతి తరాలకు ఈ భూమిని మరింత మెరుగైన స్థితిలో అప్పచెప్పడం వారి బాధ్యత.'


    'భూమి-ప్రకృతితో మానవుల సంబంధాలు ఒక హేతుబద్దమైన పద్ధతిలో (సమ సమాజంలో -అను) పునఃనిర్మించబడిన తరువాత బానిసత్వ వ్యవస్థ మాదిరిగానో, భూస్వామ్య పెత్తందారీ విధానం మాదిరిగానో, వ్యక్తిగత ఆస్తి అనే అర్ధంలేని ప్రాతిపదికనో కాకుండా... మనిషికి, భూమికి మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది. ఎందుకంటే ఈ వ్యవస్థలో భూమి సరుకుగా పరగిణించబడదు గనుక!


    150 సంవత్సరాల క్రితమే మార్క్స్‌ వివిధ సందర్భాలలో వ్యక్తం చేసిన పై అభిప్రాయాలు ఎంత ముందుచూపుతో ఉన్నాయో చూడండి! మానవ సమాజం ప్రకృతి నుండి వేరుపడితే కలిగే హానికర పర్యవసానాల గురించి మార్క్స్‌ చేసిన హెచ్చరికలు సరైనవేనని నేడు జరుగుతున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.


( 'డౌన్‌ టు ఎర్త్‌' సౌజన్యంతో )


బలులు, యాగాలు సమాజ ద్రోహమే! - డాక్టర్ దేవరాజు మహారాజు

     భారత ప్రథమ ప్రధాని పండిత జవహర్‌లాల్ నెహ్రూ దేశాన్ని వైజ్ఞానికంగా ముం దుకు నడిపారు. పారిశ్రామిక, వైజ్ఞానిక రంగాలలో దేశం నిర్వ హించాల్సిన పాత్ర గురించి నిరంతరం హెచ్చరి స్తూ వచ్చారు. భారతీయ సంస్కృతిలోని గొప్పతనాన్ని కీర్తిస్తూనే మూఢ భక్తిని, మూఢాచారాల్ని నిరసిం చారు. దేవుడి పేరిట జరిగే దుబారా ఖర్చును ఆయన ఎప్పుడూ సమర్థించలేదు. పైగా తీవ్రంగా నిరసిస్తూ ఉండే వారు. భూమి ఒక గ్రహమైతే, మిగి లిన ఎనిమిది గ్రహాల్ని ప్రసన్నం చేసుకోవడానికి ‘అష్టగ్రహ కూటమి’ పూజల కోసం కొన్నిటన్నుల ధాన్యాన్ని, కొన్ని గ్యాల న్ల నెయ్యిని అగ్నికి ఆహుతి చేయడం వాడుకలో ఉంది. 1962 లోనే ఈ పూజా విధానాన్ని ఆయన దుయ్యబట్టారు. దేశంలో ఆకలిచావులు నానాటికీ పెరుగుతున్న క్రమంలో దైవప్రీతి కోసం అంతటి ఖర్చును సమాజం భరించాల్సిందేనా అని! ఒక అర్థ శతాబ్దికి పైగా గడచిన తర్వాత దేశం వైజ్ఞానికంగా ఎంతో ముం దుకు పోతున్న దశలో ఇప్పటి ప్రధాని, ఆయన మంత్రివర్గ సహచరులు దేశాన్ని ఎంచక్కా ఆదిమ సమాజంలోకి నడిపి స్తున్న వైనం మనం కళ్ళారా చూస్తున్నాం. 


    తిరుచూరు దగ్గరలో ఒక సంప్రదాయ నంబూద్రి గ్రామం ఉంది. అక్కడ వెయ్యి సంవత్సరాలుగా ఒక హోమగుండం కా లుతూ ఉంది. ఇందులో రోజుకు మూడుసార్లు తొమ్మిది రకాల ధాన్యాన్ని ఆహుతి చేస్తారు. దానికి తగిన పాళ్ళలో నెయ్యి, కొబ్బరి కూడా జత చేస్తారు. ఇలా వెయ్యేళ్ళ నుంచి హోమం ఆరిపోకుండా ఉంచగలుగుతున్నారంటే, ప్రతి సంవత్సరం ఎం త ఖర్చు అవుతోందో ఎవరైనా లెక్కకట్టగలరా? సంవత్సరం పొడుగూతా ఇంతపెద్ద మొత్తంలో నవధాన్యాలు, నూనెలు, కొబ్బరి కాలిపోతున్నాయంటే ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంత మంది అన్నార్తుల నోళ్ళు కొట్టబడుతున్నాయీ? ఒక్కసారి ఆలో చించి చూడండి! అలాగే అభిషేక మహోత్సవం పేరిట కొన్ని వేల లీటర్ల పాలు నదుల్లో కలుపుతున్నారు. ఇట్లా ఎందుకు చేస్తున్నారంటే వాళ్ళిచ్చే ‘శాస్త్రీయ’ వివరణ ఏమిటంటే - ‘నదు ల్లో పెరిగిపోతున్న జలకాలుష్యాన్ని తగ్గించడానికి - నీటిని శుద్ధి చేయడానికీ.’ అని! లోగడ శంకరాచార్య యోగపీఠ అధిపతి స్వామి భాస్కరానంద పరమహంస స్వయంగా దగ్గ రుండి పూజలు చేస్తూ, చేయిస్తూ, వేదపఠనం చేస్తూ యమునా నదిలో సుమారు ఇరవై ఒక్కవేల లీటర్ల పాలను నీటిపాలు చేశారు. 


    యమునా నదిలో కాలుష్యం తగ్గలేదు. స్వామీజీకి దేవ తలు ప్రసన్నం కాలేదు. ఇది గాలివార్త కాదని యథార్థమేనని మనకు రెండు రుజువులు ఉన్నాయి. ఒకటి - దక్కన్ హెరాల్డ్, రెండు - అలైవ్. ఈ రెండు ఇంగ్లీషు పత్రికలు పూర్తి వివ రాలతో వ్యాసాలు ప్రకటించాయి. ‘ఈ పుణ్యభూమిలో ఎంతటి మహత్కార్యాలు జరుగుతున్నాయో కదా’ - అని మనల్ని మనం వెన్ను చరుచుకోవాలన్న మాట!

యాగాల పేరిట, యజ్ఞాల పేరిట జంతుబలులు ఇవ్వడం ఎంత నేరమో సమాజానికి ఉపయోగపడే ధాన్యాన్నీ, నూనెల్నీ, పాలని ఉపయోగానికి పనికిరాకుండా వృథా చేయడం సమాజ ద్రోహమే కదా? ఇలాంటి వాటిని నెహ్రూజీ ఎంతగా నిర సించారో, ఆయన తర్వాత వచ్చిన వారు వీటిని అంతగా నిర్లక్ష్యం చేస్తూ వస్తున్నారు. మనం మతాల ప్రభావం లోంచి, మూఢ నమ్మకాల ప్రభావంలోంచి బయటపడనిదే ఒక కొత్త దిశలో ఆలోచించలేం. వ్యక్తులుగా మనం మారితేనే సంస్థలు మారతాయి. సమాజం మారుతుంది. దేశం మారుతుంది. ప్రపంచం మారుతుంది. మూఢనమ్మకాల నుంచి బయట పడడం కష్టమే కావచ్చు. కానీ అసాధ్యం కాదు. ఎవరైనా తెగించి ‘దేవుడు’ అనేది అసంగతం, అసందర్భం, అవాస్తవం. మన నిత్య జీవితంలో ఏ శక్తి ప్రభావమూ లేదు. మానవశక్తి ప్రభావం తప్ప’- అని అంటే చాలామందికి భయం తన్ను కొస్తుంది. ‘అవన్నీ మనకెందుకూ? ఓ నమస్కారం పడేసి, హారతి కళ్ళకద్దుకుంటే పోదా?’ అని తమ పలాయన వాదాన్ని ప్రవేశపెడతారు. ఇలాంటి వారికి తమ గురించి తాము ఆలో చించుకోవడం తప్పించి, సమాజం గురించిగాని, దేశం గురించి గానీ, కనీసం పక్కవాడి గురించి గానీ, ఆలోచించడానికి ఒక్క క్షణం తీరిక ఉండదు. 


    భారత రాజ్యాంగంలో ప్రాథమిక విధుల గూర్చి ఉన్న ఈ రెండు వ్యాక్యాల గురించి ఆలోచించండి. ‘వైజ్ఞానిక ధోరణిని, మానవత్వాన్ని, సత్యాన్వేషణ తత్వాన్ని, సంస్కరణ తత్వాన్ని పెంపొందింపజేయడం ప్రతి భారత పౌరుని కర్తవ్యం.’ - ఈ భావానికి విస్తృతమైన ప్రచారం ఎందుకివ్వరు? తరాల అంత రం ఎలాగూ ఉంటుంది. కాని, కొత్తతరం వారిని కొత్తదిశలో ఎందుకు ఆలోచించుకోనివ్వరు? అవే పాత పద్ధతులు, అవే ఛాందసాలు పిల్లల మీద, యువకుల మీద బలవంతంగా రుద్ది, జాతినెందుకు నిర్వీర్యం చేస్తారు? విజ్ఞులంతా కలిసి ఆలోచించు కోవాల్సిన అంశాలు ఎన్నో ఉన్నాయి. 


    తమకు తాము భగవంతులమని ప్రకటించుకున్న వారి పని ఏమౌతూ ఉందో చూస్తూనే ఉన్నాం కదా? పెద్దవాళ్ళతో ఎన్నెన్ని పరిచయాలున్నా, కోట్లకొద్దీ డబ్బు మూలుగుతున్నా స్వామీజీలు, బాబాలు జైళ్ళకు వెళ్ళక తప్పడం లేదు. విభూది, స్విస్ గడియారాలు, మంగళసూత్రాల ట్రిక్కులు తేలిపోతున్నా యన్న భయంతో పుట్టపర్తి బాబా చివరి దశలో సాంఘిక కార్యకర్తగా వేషం మార్చాడన్నది మనం గ్రహించాలి! ఆయన కట్టించిన ఆసుపత్రులు మానవ ప్రయత్నాలే కాని, భగవత్ సృష్టికి ఉదాహరణలు కావు. అన్ని ఆసుపత్రులలో మాదిరిగానే ఆ ఆసుపత్రులలో కూడా వైద్య విజ్ఞాన నిపుణులే ప్రాణాల్ని నిలుపుతున్నారు. బాబాగారి చలవ వల్ల ఎవరి ప్రాణాలు నిలవలేదు. జబ్బులు నయం కాలేదు. ఆయన చేపట్టిన సాంఘిక కార్యక్రమాల్ని అభినందించవచ్చు. కాని ఒక అర్థశతా బ్దంపైగా హస్తలాఘవంతో వస్తువుల్ని సృష్టించి జనాన్ని మోసం చేస్తుంటే మన ప్రభుత్వాలేం చేశాయి? వైజ్ఞానిక సంస్థలేం చేశాయి? ఆలోచించండి?


    ‘శూన్యం లోంచి శూన్యం తప్ప మరేదీ రాదు’ -  అన్న సూత్రం ఇప్పటిది కాదు. క్రీ.పూ. 99-55 లలోనే లుక్రీషియస్ ప్రతిపాదించాడు. కాని ఇన్నివేల యేళ్ళు గడిచినా మనం శూన్యంలోంచి ఎవరైనా, ఏదైనా... మ్యాజిక్ చేసి సృష్టిస్తే నిజమేనని నమ్ముతున్నామే! ఇలాంటి విషయాల్లో శాస్త్రవేత్తలు మౌనం వహిస్తారెందుకూ? స్వభావసిద్ధమైన ప్రకృతి సూత్రా లకు భిన్నంగా ఏదీ జరగదని జనసామాన్యానికి తెలియ జెప్పరెందుకనీ? వీరి మౌనమే ‘మానవ దేవుళ్ళ’కు ఒకరకంగా బలం చేకూర్చుతూ ఉంది. విద్యావంతులు, శాస్త్రజ్ఞులు సామా న్యుడికి అండగా నిలబడలేక పోవడం వల్లే, అతడు అయోమ యంలో కొట్టుకుపోతున్నాడు. ప్రవాహానికి ఎదురీదడానికి ఎంతో ఆత్మవిశ్వాసం కావాలి. అదెంతో కష్టమైన పని. ప్రవాహంలో పడి కొట్టుకుపోవడం చాలా తేలికైన పని. అందుకే ఎక్కువ మంది కళ్ళు మూసుకుని ప్రవాహంలో కొట్టుకు పోవడానికే ఇష్టపడుతున్నారు. అందుకే ఈ సమాజ స్వరూపం ఇలా ఉంది. 


    ‘మానసిక దౌర్బల్యం గల కొంతమంది శాస్త్రవేత్తలు ప్రజల్లోకి వచ్చి - ప్రజల భావనల్ని అర్థం చేసుకుని, నిజా నిజాలేవో బహిరంగంగా చర్చించలేకపోతున్నారు. నిజానికి ఇదే వారి ముఖ్యమైన బాధ్యత!’- అని అంటారు కార్ల్ సాగన్ ( ప్రఖ్యాత హేతువాది, సైన్స్ రచయిత, వైజ్ఞానికుడు). కొత్త విషయాల్ని కనిపెట్టి, దేశాన్ని ప్రపంచ దేశాల మధ్య తలెత్తుకునేట్లు చేయగల శాస్త్రవేత్తలు, ప్రొఫెసర్లు మనకు తప్పకుండా కావాలి. అయితే వారు ప్రయోగాలకే పరిమితమై పోకుండా, సామాన్యుడి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తూ వారికి అండగా నిలబడగలగాలి. ముందు తరాల్ని ప్రభావితం చేయ గలగాలి కూడా! తద్వారా సమాజంలో హేతుబద్ధత గణనీయంగా పెంచగలగాలి!


- రచయిత ప్రముఖ సాహితీవేత్త, బయాలజీ ప్రొఫెసర్

9573706806


మాన‌వ‌తా దీప్తి‌.. మ‌హోన్న‌త స్ఫూ‌ర్తి‌..- కారల్‌ మార్క్స్

 

:: మార్క్సిస్టు మహోపాధ్యాయుడు కారల్‌ మార్క్స్‌ ద్విశత జయంతి సందర్భంగా 2018లో రాసిన స్నేహ అట్ట మీది కథ. రేపు మార్క్స్ జయంతి)

 

మారాలి .. మారాలి.. ఈ పరిస్థితి మారాలి  అని అనుకోవటం అన్ని కాలాల్లోనూ, అన్ని తరాల్లోనూ జరిగేదే! 'ఏం మారాలో, ఎందుకు మారాలో' అన్నది కూడా అందరూ తర్కించుకునేదే! మరి ఆ మార్పు ఎలా సాధ్యం? మార్చటం ఎలాగ? అన్నదే కీలకం. ఆ కీలకమైన పనికి తిరుగులేని ఆయుధం సంధించినవాడు - కారల్‌ మార్క్స్‌. మార్పు అవసరత గురించి, అనివార్యత గురించీ స్పష్టమైన అవగాహననీ, సిద్ధాంతాన్నీ, ప్రణాళికనూ మానవాళికి అందించిన మహనీయుడు ఆయన. కారల్‌మార్క్స్‌ పుట్టి, వచ్చే మే 5 నాటికి రెండొందల ఏళ్లు. ద్విశత జయంతి ఉత్సవవేళ ఆ మానవతావాదిని, మహామేధావిని స్మరించుకుందాం.

 

సహస్రాబ్ది(2000) లోకి అడుగిడుతున్న వేళ .. ప్రపంచవ్యాప్తంగా ఒక సర్వే జరిగింది. ఈ సహస్రాబ్దిలో అత్యంత ప్రభావశీలమైన వ్యక్తి ఎవరన్నది ప్రశ్న. 'కారల్‌ మార్క్స్‌' అన్నది ప్రపంచం చెప్పిన జవాబు. దేశదేశాలపై అంతగా, అత్యంత ప్రభావవంతంగా ప్రసరించి ప్రభంజనం సృష్టించింది మార్క్స్‌ సిద్ధాంతం. ఇంతవరకూ జరిగిన చరిత్రలోంచి, రకరకాల పరిణామాల్లోంచి సారాంశాన్ని గుంజి, దానికొక శాస్త్రీయ కార్యాకారణ బంధాన్ని నిర్వచించింది. ఈ ప్రపంచం మారకతప్పదని, అది అనివార్యమని గొంతెత్తి చెప్పింది. కొద్దికాలంలోనే ఆ సిద్ధాంతం ఆచరణలో నిరూపితమైంది. 1917లో రష్యాలో కార్మికులు, కర్షకులు ఎర్రజెండా అండగా కదం తొక్కారు. జార్ల నిరంకుశ పాలన అంతమై, ప్రజారాజ్యం ఆవిర్భవించింది. ఆ ప్రభావం ప్రత్యక్షంగా, పరోక్షంగా అన్ని దేశాలపైనా ప్రసరించింది. పెట్టుబడీదారీ విధానానికి భిన్నమైన మార్గం ఉందని చాటి చెప్పింది. మార్క్స్‌ తాను బతికి ఉన్న కాలంలో ఈ విప్లవాలను చూడలేదు. కానీ, ఆయనకు నమ్మకంగా తెలుసు; ప్రజారాజ్యాల ఆవిర్భావం తప్పనిసరి అని.

ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న కనిపించని ఆర్థిక దోపిడీకి, కనిపించే అన్ని రకాల అరాచకాలకు, ఆకలిచావులకు, దారుణ దౌర్జన్యాలకు 'పెట్టుబడీదారీ వ్యవస్థే కారణం' అంటాడు మార్క్స్‌. ఇలాంటి అస్తవ్యస్త అంతరాల వ్యవస్థ నుంచి విముక్తిని కోరుతోంది ఆయన సిద్ధాంతం. దోపిడీ, పీడన, దారిద్య్రమూ లేని సమతారాజ్యం ఆయన ఆకాంక్ష.

 

మానవతావాది, దార్శనికుడు

ప్రపంచ మానవాళి మంచిని కోరుకున్న గొప్ప మానవతావాది కారల్‌ మార్క్స్‌. అందరిలాగానే బతికేయదలిస్తే- ఆయన చదువుకు, విజ్ఞానానికి ఎంతో సౌకర్యవంతమైన పదవులు వచ్చి ఉండేవి.

కానీ, ఆయన అలాంటివేమీ కోరుకోలేదు. ప్రపంచంలోని అన్నార్తుల బాధను తన బాధగా చేసుకున్నాడు. ఆ బాధలకు కారణం ఏమిటో కనుక్కొన్నాడు. దానినుంచి విముక్తికి మార్గమేంటో వివరించాడు. తన జీవితం మొత్తం ఒక గొప్ప సిద్ధాంతాన్ని నిర్మించటానికి, గొప్ప తాత్విక భూమికను ఏర్పర్చటానికీ అంకితం చేశాడు. ఆ కృషిలో భాగంగా ఆయన ఎదుర్కొన్న కష్టాలు అనేకం. చవిచూసిన అవమానాలు సవాలక్ష. అయినా, వాటిని ఇంతమాత్రంగా కూడా లెక్క చేయలేదు. అకుంఠిత దీక్షను కొంత కూడా మొక్కవోనీయలేదు. ధీర గంభీరమైన పిలుపునిచ్చాడు : 'ప్రపంచ కార్మికులారా, ఏకం కండు. పోరాడితే పోయేదేం లేదు, బానిస సంకెళ్లు తప్ప.' ఇది ఎంత గొప్ప పిలుపు! ప్రపంచ చరిత్రకు ఇదొక మూల మలుపు!

'వర్గపోరాటాల చరిత్రే ప్రపంచ చరిత్ర.' అన్న ఒకేఒక్క మాటతో తరతరాల యుద్ధాల ఆంతర్యాన్ని విప్పి చెప్పేశాడు మార్క్స్‌.

 

ప్రజామిత్రుడు .. ప్రపంచ హితుడు

మార్క్స్‌ పడక కుర్చీ మేధావి కాదు. అప్పటివరకూ ప్రచారంలో ఉన్న అన్ని సామాజిక సిద్ధాంతాలను తీవ్రంగా అధ్యయనం చేశాడు. సమకాలీన తత్వవేత్తలతో, ఆలోచనాపరులతో, ఉద్యమకారులతో సుదీర్ఘంగా, సవివరంగా, విశ్లేషణాత్మకంగా చర్చించాడు. ప్రపంచంలో ఏ మూల పరిణామం జరిగినా- దాని వివరాలు తెలుసుకొని, చాలా లోతైన విశ్లేషణ చేసేవాడు. 1857 భారత తొలి స్వాతంత్య్ర సంగ్రామంపై ఆయన రాసిన పరిశీలనా వ్యాసాలు అలాంటి విశాల దృష్టికి నిదర్శనం. దేశం ఏదైనా ప్రపంచ ప్రజలంతా ఒకటే అన్నది మార్క్స్‌ అవగాహన. శ్రమను దోచుకొని, దాని ఆధారంగా సంపద కూడబెట్టేది ఒక వర్గం. శ్రమనే (శారీరక లేదా మేధోపరమైన శ్రమ) నమ్ముకొని, దానిని వేతనానికి అమ్ముకొని నష్టపోయేది మరొక వర్గం. ప్రపంచంలో ఎక్కడైనా ఇదే విభజన ఉంటుంది. తాను శ్రామిక ప్రజల పక్షాన నిలబడ్డాడు. శ్రామికులు ఉత్పత్తి శక్తుల మీద ఆధిపత్యం కలిగిఉంటే - ఇప్పుడున్న సమస్యలేవీ ఉండవని చెప్పాడు.

 

చిన్నప్పుడే స్పష్టత

గుబురు గడ్డంతో గంభీరంగా కనిపించే మార్క్స్‌ నిజానికి హాస్యప్రియుడు. చాలా సరదా మనిషి. పేదరికంపై కూడా జోకులు వేసి, నవ్వుకోగలిగిన ధైర్యశాలి. చిన్నప్పటినుంచి చదువులో మహా చురుకు. గొప్ప ఆలోచనాపరుడు. మార్క్స్‌ తండ్రి హెన్రిచ్‌ న్యాయవాది. ప్రాచీన సాహిత్యం, తత్వశాస్త్రం బాగా చదువుకున్నాడు. ప్రగతిశీల భావాలు కలిగి ఉండేవాడు. 1818 మే 5న పుట్టిన మార్క్స్‌కి ఆ ఇంటి వాతావరణం చిన్నప్పటినుంచి బాగా ఒంటపట్టింది. చదవటం, తార్కికంగా ఆలోచించటం, చర్చించటం అలవాటుగా మారింది. స్కూల్లో తన ఆలోచనలు మిగతా విద్యార్థుల కన్నా భిన్నంగా ఉండేవి. స్కూలు ఫైనల్‌లో ఒకసారి 'వృత్తి ఎంపికలో ఒక యువకుడి భావాలు' పేరిట వ్యాసం రాశాడు. వృత్తి ఎంపిక అనేది స్వార్థచింతన, సొంతలాభంతో ముడిపడి ఉండకూడదని, ప్రజలందరి మేలు కోరి పనిచేయటంలో ఎంతో తృప్తి ఉంటుందని పేర్కొన్నాడు. నూనూగు మీసాల యువకుడిలో పొద్దుపొడుస్తున్న ప్రగతిశీల విశాల భావాలకు అదొక ఆరంభం.

 

తత్వశాస్త్రంపై తరగని మక్కువ

1836లో బాన్‌ విశ్వవిద్యాలయంలో న్యాయవాద విద్యలో చేరాడు. అక్కడ న్యాయశాస్త్ర పుస్తకాల కన్నా తత్వశాస్త్రమే ఆయన్ని ఎక్కువగా ఆకర్షించింది. ప్రపంచం నడకని, దానిలో ఇమిడి ఉన్న సూత్రాలను అర్థం చేసుకోవటానికి; తత్వవేత్తలతో చర్చలకు ఆ అధ్యయనం ఎంతగానో ఉపయోగపడింది. 'తత్వవేత్తలు ఈ ప్రపంచాన్ని పరిపరి విధాలుగా నిర్వచించారు. ఇప్పుడు కావాల్సింది దానిని మార్చటం..' అనే మార్క్స్‌ అవగాహన కొత్త మార్పునకు నాంది. అదే తరువాతి కాలంలో 'పెట్టుబడి' గ్రంథం ఆవిర్భావానికీ; 'కమ్యూనిస్టు ప్రణాళిక' అవతరణకూ మూలం.

 

ప్రేమికుడు .. కవితాహృదయుడు

మార్క్స్‌ చాలా గొప్ప లోతైన తాత్విక, ఆర్థిక, సామాజిక విషయాలను తన వ్యాసాలూ, పుస్తకాల నిండా రాశాడు. అయితే, ఆయన సహజంగా కవి, సాహిత్య ప్రియుడూ కావటం వల్ల- వ్యక్తీకరించే భాష హృద్యంగా ఉంటుంది. ఆర్థిక అంశాలను చెప్పేచోట కూడా కవిత్వ భాషా పరిమళం గుబాళిస్తుంది. యుక్తవయసులో ఉన్నప్పుడు ఆయన కూడా చిన్న పాటి కవే! న్యాయవిద్య చదూతున్నప్పుడే జెన్నీని ప్రేమించాడు. తన మనసున ముసిరే ప్రతి భావాన్ని అందమైన కవితగా అల్లేవాడు. అలా మూడు నోట్‌ పుస్తకాలు నింపేశాడు. ప్రతి పుస్తకం మొదటి పేజీలో ఒకటే నివేదన... 'ప్రియమైన జెన్నీ వెస్ట్‌ఫాలన్‌కు..' అని. జెన్నీకి ఈ ఒత్తయిన జుట్టున్న చురుకు చూపుల కుర్రాడంటే ప్రాణానికి మించిన ఇష్టం. జెన్నీ, మార్క్స్‌ చెల్లెలు సోఫీ మిత్రులు. అలా ఆ ఇంటికి వెళ్లినప్పుడే జెన్నీకీ, మార్క్స్‌కీ పరిచయం. అది ఇష్టంగా, ప్రేమగా మారటానికి ఎంతో కాలం పట్టలేదు. జెన్నీ ధనవంతుల బిడ్డ. కానీ, మార్క్స్‌లోని విజ్ఞానం, ప్రపంచం పట్ల అతడి దృక్పథం ఆమెను బాగా ఆకర్షించాయి. చదువు రీత్యా మార్క్స్‌ దూరంగా ఉన్నప్పుడు జెన్నీ ఎంతో ఇష్టంగా ఉత్తరాలు రాసేది. 'నీ ఫొటో నా కళ్లముందు ఎంతో మహాద్భుతంగా, విజేతగా కనిపిస్తుంది. నువ్వు నిరంతరం నా కళ్లముందే ఉండాలని మనసు పరితపిస్తోంది. ఎక్కడికెళ్లినా నీ ఊహ, ఉనికీ నా వెన్నంటే ఉంటాయి. నువ్వు ముందుకు సాగిపో. నేను నీ బాటను చదును చేసి, అడ్డంకులన్నిటినీ తొలగించగలిగితే చాలు..' జెన్నీ రాసిన ఒక ఉత్తరంలోని మాటలివి. ఇలాంటి సున్నితమైన, ఆహ్లాదకరమైన భావాలు పరిఢవిల్లిన ప్రేమైక మనసులు ఆ ఇద్దరివీ. ప్రేమలో పడ్డాక పెళ్లి చేసుకోటానికి ఏడేళ్ల సమయం పట్టింది.

 

నిషేధాలూ.. నిర్బంధాలూ

సమాజం మార్పు కోరుకునే మార్క్స్‌ భావాలు పాలకులకు నచ్చలేదు. కార్మికులు, కర్షకులు ఏకం కావాలనే పిలుపులూ, రాతలూ వాళ్లకు నిద్ర పట్టనీయలేదు. అధికారం చేతిలో ఉన్నవాడు అప్పుడేం చేస్తాడు? మార్క్స్‌ రచనలపై నిషేధం.. దేశం నుంచి బహిష్కరణ.. ద్వీపాంతరవాసం. ప్రపంచమంతటా తన వాళ్లు ఉన్నారని నమ్మే మార్క్స్‌కి ఈ శిక్ష ఒక లెక్కా? ఎక్కడికి వెళ్లినా తన పని మానలేదు. విస్తారంగా చదవటం, విస్తృతంగా రాయటం. ప్రపంచాన్ని మార్చే సిద్ధాంతానికి మరింత పదును పెట్టటం. పాలకులు విధించే ప్రతి నిషేధాన్ని, నిర్బంధాన్నీ తన అధ్యయనానికి ఒక పాఠంగా చేసుకోవటం.

ఈ క్రమంలో మార్క్స్‌ కుటుంబం అనేక కష్టాలు పడింది. కష్టం అంటే ఏంటో తెలియని జెన్నీ అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. పసిబిడ్డకు పాలు కూడా ఇవ్వలేని స్థితి! ఇంటి అద్దె కట్టకపోతే- యజమాని ఛీత్కారాలు ఎదుర్కోవాల్సిన దుస్థితి! ఏ అర్ధరాత్రో పోలీసులు ఇంటిపై దాడి చేసే దుశ్చర్యలు, బెదిరింపులూ.. ఇలా ఎన్నో ! అయినా, ఆమె ధైర్యం సడలలేదు. ప్రేమ తగ్గలేదు. ఆమెకు తెలుసు - మార్క్స్‌ అంటే మామూలు మనిషి కాదు; మహా మనిషి. ఈ ప్రపంచాన్ని మార్చటానికి అక్షర శస్త్రాలను సిద్ధం చేస్తున్న తపస్వి... అని. జీవితాంతం ఆ నమ్మకానికి కట్టుబడే ఉంది. మార్క్స్‌ రచనలను ఆమె ప్రచురణకు వీలుగా తిరిగి రాసేది. పత్రికలతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపేది. ప్రచురణకర్తలతో మాట్లాడేది. మార్క్స్‌ రచనా సమయం వృథా కాకుండా- అన్ని పనులూ తాను చక్కబెట్టేది. అందుకే వారిది ఆదర్శ దాంపత్యం. జెన్నీ రాసిన ఓ లేఖ వారి హృదయబంధాన్ని చాటిచెబుతుంది. 'చిన్న చిన్న కష్టాలు నన్ను లొంగదీశాయని అనుకోవొద్దు. ఈ పోరాటం ఒంటిరిది కాదని నాకు బాగా తెలుసు. నా ప్రియమైన మార్క్స్‌ నా దగ్గర ఉన్నంతవరకూ నేను అత్యంత అదృష్టవంతురాలిని.' అని ఆ ఉత్తరంలో పేర్కొంది.

 

అతడొక గొప్ప మిత్రుడు

మార్క్స్‌ గొప్ప స్నేహశీలి. ఫెడరిక్‌ ఏంగెల్స్‌తో ఆయన స్నేహం చాలా గొప్పది. అది విశ్వమానవ కల్యాణానికి దోహదపడ్డ మైత్రి. మార్క్స్‌లోని మేధావిని, సిద్ధాంత పటిమను గుర్తించి- ఆయనకు అడుగడుగునా సహాయపడ్డాడు ఏంగెల్స్‌. ఇద్దరూ గొప్ప ఆలోచనాపరులే! ఇద్దరిదీ ఒకే లక్ష్యం. అది ఈ సమాజాన్ని మార్చే ఆయుధాన్ని ఆవిష్కరించటం. ఇద్దరూ అనేక విషయాలపై తర్జనభర్జనలు, చర్చోపచర్చలూ జరిపేవారు. ఇద్దరూ ఒక అవగాహనకు వచ్చాకే దానిని నిర్ధారించేవారు. కొన్ని వందల, వేల ఉత్తరాలు రాసుకున్నారు ఇద్దరూ. అన్నీ రాజకీయ, తాత్విక, సామాజిక అంశాలే! ఇద్దరూ గొప్ప అధ్యయనపరులు. గొప్ప తార్కిక వాదులు. ఏకోన్ముఖమైన తమ లక్ష్యం దిశగా నడవటానికి 1850 దశకంలో ఇద్దరూ ఒక పనివిభజన చేసుకున్నారు. అదేమిటంటే- ఒక్కొక్కరు ఒక్కో విషయం మీద కేంద్రీకరించి, అధ్యయనం చేయాలి. తరువాత పరస్పరం చర్చించుకొని అవగాహన పెంచుకోవాలి. రాజకీయ అర్థశాస్త్రం, ప్రపంచ చరిత్ర, ఐరోపా దేశాల విదేశాంగ విధానంపై అధ్యయనం మార్క్స్‌ పని. మిలటరీ శాస్త్రం, భాషాశాస్త్రం, జీవిశాస్త్రాలపై అధ్యయనం ఏంగెల్స్‌ బాధ్యత. ఒకరు రాసింది ఒకరు చదవాలి. ఇద్దరి మధ్యా ఏకాభిప్రాయం రావాలి. అప్పుడే ఆ వ్యాసం ప్రచురణ, బయట చర్చ. ప్రపంచంలో అప్పటినుంచి ఇప్పటివరకూ గొప్ప గొప్ప వాళ్ల వ్యక్తిగత స్నేహాలు ఎన్నయినా ఉండొచ్చు గాక! కానీ, ప్రపంచానికి మేలు చేసిన గొప్ప స్నేహం మార్క్స్‌ - ఏంగెల్స్‌దే!

 

కడపటి రోజులు

మార్క్స్‌ తన పిల్లలకు, జెన్నీకి రాసిన ఉత్తరాల నిండా గొప్ప ప్రేమ, ఆర్ధ్రత పరుచుకొని ఉంటాయి. అమ్మానాన్నల పట్ల ఆ పిల్లలకు కూడా అంతే ప్రేమ. ఇద్దరూ కుమార్తెలూ కమ్యూనిస్టు ఉద్యమంలో పనిచేశారు. అల్లుళ్లు కూడా ఉద్యమ నాయకులే. తమది విశ్వమంత కుటుంబం అనే భావనతో ఉండేవారు. దీర్ఘకాలం అనేక ఒత్తిళ్లూ సమస్యలూ ఎదుర్కొన్న జెన్నీనీ, మార్క్స్‌నీ అనారోగ్యం ఆవహించింది. క్యాపిటల్‌ గ్రంథ రచనకు మార్క్స్‌ అహర్నిశలూ శ్రమించాడు. అనారోగ్యంతో మంచం పట్టినా రచనను విడిచిపెట్టలేదు. జెన్నీ లివర్‌ క్యాన్సర్‌ బారిన పడింది. తీవ్రమైన నొప్పిని పంటిబిగువన అణచిపెట్టేది. ఆమె ఆఖరి రోజుల్లో మార్క్స్‌ మంచం దగ్గరే ఉండేవాడు. ఆరోజుల్లోనే క్యాపిటల్‌ మూడో ముద్రణ పొందింది. జెన్నీ 1881 డిసెంబర్‌ 2న తుదిశ్వాస విడిచింది. అది మార్క్స్‌కి కోలుకోలేని దెబ్బ. 'జెన్నీ చనిపోయినప్పుడే మార్క్స్‌ కూడా చనిపోయాడు..' అని వ్యాఖ్యానించాడు ఆయన ప్రియమిత్రుడు ఏంగెల్స్‌. జెన్నీ - మార్క్స్‌ల గాఢానుబంధానికి ఆ వ్యాఖ్యే ఒక నిదర్శనం. ఆ కొద్దికాలంలోనే పెద్ద కుమార్తె కూడా చనిపోయింది. ఈ విషాదాలన్నీ ఆయన్ని తీవ్ర ఆవేదనకు గురి చేశాయి. అయితే, మాటల్లో, చర్చల్లో తనకు ఇష్టమైన తత్వ, ఆర్థిక శాస్త్రాల గురించి చర్చిస్తూనే ఉండేవాడు. పిల్లలకు తమాషా ప్రశ్నలు వేసి .. అలరించేవారు. ఉబ్బసం, ఊపిరితిత్తుల్లో కణితి, గొంతుమంట వంటి సమస్యలు ఆయన్నీ చుట్టుముట్టాయి. మిత్రులు, చిన్న కుమార్తె, కుటుంబ శ్రేయోభిలాషి లెంచెన్‌ పరిచర్యలు చేసేవారు. 1883 మార్చి 14 : ఏంగెల్స్‌ రోజూలాగానే పలకరించటానికి వచ్చాడు. మార్క్స్‌ గదిలోకి వెళ్లాడు. ఆయన ప్రియ మిత్రుడూ, లోకబాంధవుడూ అప్పటికే తుదిశ్వాస విడిచాడు.

ప్రపంచ కార్మికులు, శ్రామికులు దుఃఖిల్లారు. అంత దుఃఖంలోనూ ఒక ప్రతిన పూనారు. 'మార్క్స్‌ మహానీయుడు ఎప్పటికీ బతికే ఉంటాడు. ఆయన అందించిన సిద్ధాంతం ప్రపంచానికి వెలుగు బావుటా. దానిని అందుకొని ముందుకు సాగుతాం. కార్మిక కర్షక రాజ్యాన్ని సాధిస్తాం. అదే ఆయనకు నివాళి.' అని.

నిజమే కదా .. మార్క్స్‌కి మరణం లేదు. ఆయన శ్రామికుడి చెమటచుక్కలోని సౌందర్యం. కార్మికుడి పిడికిలిలోని చైతన్యం. గొంతెత్తే ప్రశ్నలోని నినాదం. నేటి ఆచరణకు ఆయువుపట్టు. రేపటి నిర్మాణానికి సైద్ధాంతిక తొలిమెట్టు.

 

మనవడి స్వారీకి సలాంగిరీ!

జెన్నీ - మార్క్స్‌ల ఇల్లు స్నేహితులకు గొప్ప మజిలీ. మంచి ఆతిథ్యానికి మారు పేరు. ఎంతోమంది వస్తూ వెళుతూ ఉండేవారు. ఒకసారి విల్‌హెల్మ్‌ అనే మిత్రుడు మార్క్స్‌ ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో మార్క్స్‌ చేస్తున్న పని ఏమిటంటే- తన మనవడిని వీపు మీద ఎక్కించుకొని ఎద్దులా నడవటం. ఆ చిన్నోడేమో- బండివాడిలా తాత మీద ఎక్కి స్వారీ చేయటం. వాడు ఊరుకే కూచొని మజా చేయటం లేదు. విజృంభించి అరుస్తున్నాడు. తాతకు చాలా భాషలు తెలుసు కదా.. అందుకని ఇంగ్లిషు, ఫ్రెంచి, జర్మన్‌ భాషల్లో అరుస్తూ అదిలిస్తున్నాడు. 'గో ఆన్‌.. పాస్‌లైట్‌ .. హుర్రా..' అంటూ కదం తొక్కిస్తున్నాడు. మార్క్స్‌ తన చేతులు, మోకాళ్ల మీద నడుస్తూ గది అంతా తిప్పుతున్నాడు. విల్‌హెల్మ్‌, ఏంగెల్స్‌ తెగ నవ్వుకున్నారు. తరువాత ఆ మనవడితో జాగ్రత్తగా సంప్రదింపులు జరిపి, తాతకు విముక్తి కలిగించారట!

I N V I T A T I O N

The free Bi-Monthly (Feb,Apr,Jun,Aug,Oct,Dec) Medical Camp held for B.P., Sugar pationts at Sree Chakri Vidyanikhatan High school, Chakripuram cross Road, ECIL to Nagaram, Hyderabad. This camp is conducted on every 4th sunday of the month from Morning 7am to 10am. The consultation includes Sugar Test, BP Test, Doctor consultation and Medicines. Only Rs.100/- will be charged for one month medicines. All are Invited
JANAVIGNANA VEDIKA (Affiliated to AIPSN)